దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో అష్టకష్టాలు పడుతోంది. అసలే ఎండలు. ఏసీ లేక చెమటలు ఓవైపు.. చీమలు, దోమల బెడదతో మరోవైపు చిన్నమ్మ ఇబ్బందులు పడుతోంది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో సాధారణ ఖైదీగానే ఆమెను చూస్తున్నట్లు.. ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని కర్ణాటక జైళ్ల శాఖ ఐజీ వీరభద్రస్వామి చెప్తున్నారు.
జైలులో ఇతర ఖైదీలకు అందిస్తున్నట్లే.. శశికళకు కూడా మూడుపూట్ల ఆహారం అందిస్తున్నామని.. అయితే ఆ ఆహారాన్ని ఆమె చాలా కష్టపడి తింటున్నారని ఐజీ చెప్పారు. జయ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించే శశికి ఇంటి భోజనం ఇవ్వడం లేదని.. కానీ ఆమెను కలిసేందుకు వస్తున్నవారు తెస్తున్న పండ్లను ఆమె తీసుకుంటున్నారని ఐజీ తెలిపారు.
ఇంకా చెప్పాలంటే.. దోమల బెడదతో చిన్నమ్మ ఇబ్బందులు పడుతున్నట్లు జైలు అధికారులు సమాచారం ఇచ్చారని, కర్ణాటక జైళ్ల శాఖ నియమాల ప్రకారం తాము ఖైదీలకు సదుపాయాలు కల్పిస్తామని.. కోర్టు ఆదేశాలు లేకుండా ఎవ్వరికీ ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించే ప్రసక్తే లేదన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఖైదీలు ఎవరికైనా ప్రత్యేక సదుపాయాలు కల్పించారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు.