ముంచుకొస్తున్న రెండోదఫా కరోనా ముప్పు - నిర్లక్ష్యం వద్దు, అప్రమత్తంగా ఉందాం

మంగళవారం, 24 నవంబరు 2020 (07:06 IST)
1918 నుండి 1919 వరకు స్పానిష్ ఫ్లూ కూడా రెండో దశలో అత్యంత ప్రమాదకరంగా మారి కోట్లాది మందిని బలితీసుకుంది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా రెండో దఫాలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవలే ప్రకటించింది.  ఈ దృష్ట్యా ఇప్పటికే స్పెయిన్ లో మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్ లోనూ నెల రోజులు లాక్ డౌన్ విధించారు. ఇదే తరహాలో ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఆంక్షలు విధించారు.

అమెరికాలోనూ కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. 
మరోవైపు మనదేశంలోనూ కరోనా కొన్ని రాష్ట్రాల్లో తీవ్రరూపం దాలుస్తోంది. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది.

ముఖ్యంగా ఇటీవల కాలంలో తెరుచుకున్న పాఠశాలలు కూడా మళ్లీ మూతపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు మళ్లీ మొదలయ్యాయి. అసలే చలికాలం కావడంతో కేసుల తీవ్రత మరింత పెరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 
 
మనదేశంలోనూ అప్రమత్తం:
దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హరియాణా, ముంబై, అహ్మదాబాద్, ఇండోర్, రాజస్థాన్ లో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కొన్ని చోట్ల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యక్తిగత, సామాజిక రక్షణ చర్యల అమలుపై దృష్టిపెట్టడం మేలని సూచిస్తున్నారు.
 
- ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేస్తూనే కొన్ని కఠిన నిబంధనలు విధించింది. మాస్కు వేసుకోకపోతే, కోవిడ్-19 నిబంధనలు అతిక్రమించినా రూ.5వేలు జరిమానాలు విధిస్తామని ప్రకటించింది.

పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కేవలం 50 మందికే అనుమతి ఇచ్చారు. ప్రజలు గుమికూడే మార్కెట్ల దగ్గర కఠినమైన నిఘా ఉండాలని ఆదేశించింది. హరియాణా, అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, వడోదర, ముంబై, పుణె లాంటి నగరాల్లోనూ మళ్లీ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి.  
 
- ప్రస్తుతానికి కరోనా వైరస్ కు పూర్తిస్థాయిలో మందులు లేవు. వ్యాక్సిన్లు కూడా ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు వెంట శానిటైజర్ ను కూడా తీసుకుని వెళ్లాలి.

అవకాశం ఉంటే తరచూ సబ్బు, నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్). కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.
 
సబ్సు లేదా శానిటైజర్
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం. 
 
మాస్కు ధరించడం
కోవిడ్ ను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి.

మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.  
 
భౌతిక దూరం
కోవిడ్ ను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. 
 
పైన సూచించిన విధంగా ప్రతిఒక్కరూ ఎస్.ఎం.ఎస్ (సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం. కోవిడ్ మహమ్మారిని జయిద్దాం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు