తమిళ రాజకీయాల్లో అమ్మకు తర్వాత ఐకాన్గా నిలిచి.. సీఎం కావాలనుకున్న చిన్నమ్మ శశికళ ఆశలు గల్లంతైనాయి. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో చిన్నమ్మ ప్రతిపాదించిన పళనిస్వామి తమిళనాట సీఎం అయ్యారు. ఇలాంటి తరుణంలో జైలు నుంచే చిన్నమ్మ పెత్తనం చెలాయించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా మంత్రులు ఆమెను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను కలిసేందుకు తమిళనాడు మంత్రులను అనుమతించొద్దని కోరుతూ కర్ణాటక హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి పేర్కొన్నారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్లు జైలుశిక్ష పొందిన శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులో ఉన్న పరప్పన్ అగ్రహారం జైలులో గత నెల 15వ తేదీ నుంచి ఖైదీలుగా ఉన్నారని గుర్తుచేశారు. వారిని కలుసుకునేందుకు రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే ప్రముఖులు పోటీ పడుతున్నారని, వీరిని అనుమతించొద్దని కోరుతూ తాను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ త్వరలో విచారణకు వస్తుందన్నారు.
శశికళకు మాజీ మంత్రుల పాదాభి వందనం జైలు ఖైదీగా ఉన్న శశికళను కలుసుకుని తమిళనాడు మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర పాదాభివందనం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలకు బ్రేక్ వేసేందుకే రామస్వామి కేసు దాఖలు చేశారు. ఇంకా చిన్నమ్మను తుమకూరు జైలుకు తరలించాలని, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా రామస్వామి డిమాండ్ చేశారు.