సిగ్గులేని శివసేన... చెప్పుతో కొట్టిన ఎంపీ కోసం బంద్... విపక్షాల ఫైర్

సోమవారం, 27 మార్చి 2017 (15:35 IST)
మహారాష్ట్రలో శివసేన పార్టీపై విపక్షాలు మండిపడుతున్నాయి. శివసేన నేతలకు సిగ్గు లేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. కనీస మర్యాద లేకుండా ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీ కోసం బంద్ నిర్వహించడం సిగ్గుచేటని వారు ఆరోపిస్తున్నారు. 
 
శివసేనకు చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టారు. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో పాతిక సార్లు కొట్టినట్లు గైక్వాడ్‌ స్వయంగా చెప్పడమే కాకుండా, తాను క్షమాపణ చెప్పేది లేదని, అతడే తనకు క్షమాపణలు చెప్పాలని వెల్లడించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగిన సంగతి తెలిసిందే. దీంతో గైక్వాడ్‌ను విమానయాన సంస్థలు ‘నిషేధిత జాబితా’లో చేర్చింది. ఫలితంగా ఆయనకు విమాన టిక్కెట్లు కూడా జారీ చేయడం లేదు. దీంతో గైక్వాడ్ రైళ్ళలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు పార్టీ మద్దతుగా నిలుస్తోంది. గైక్వాడ్‌కు మద్దతుగా ఆయన లోక్‌సభ నియోజకవర్గమైన ఉస్మానాబాద్‌లో శివసేన సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఎయిరిండియా, ఇతర ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ నుంచి ఆయనను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన బంద్‌ నిర్వహిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి