స్నేహితుడి తల తెగనరికి.. సీఎం ఫాంహౌస్‌కు సమీపంలో పూడ్చిపెట్టారు...

మంగళవారం, 22 జూన్ 2021 (09:27 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాంహౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన సత్నాం సింగ్, దేశ్ రాజ్, జాగీర్ సింగ్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీరంతా కలిసి సుచా సింగ్ అనే మిత్రుడిని మద్యం తాగుదాం అంటూ పిలిచారు. 
 
సీఎం ఫాంహౌస్ సమీపంలోనే వీళ్లంతా మద్యం తాగడం ప్రారంభించారు. వీరిలో ఒకరికి సుచా సింగ్ రూ.60 వేలు బాకీ ఉన్నాడు. అవి ఎప్పుడిస్తావు? అంటూ ముగ్గురూ కలిసి సుచాను నిలదీశారు. ప్రస్తుతం కరోనా కష్టాల్లో ఉన్న సుచా.. ఇంకా సమయం కావాలని అడిగాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం చెలరేగింది.
 
వివాదం పెరగడంతో ముగ్గురు మిత్రులూ కలిసి సుచాపై దాడి చేశారు. కత్తితో అతని తల నరికి, దగ్గరలోనే ఆ శవాన్ని పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. సుచా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అదేసమయంలో సుచా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశంలో అతని కాళ్లు కనిపించడంతో భయపడిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు తల లేని మృతదేహం కనిపించింది. దుస్తులను చూసి అది సుచా మృతదేహమని గుర్తించారు. దర్యాప్తులో ఆ రోజు సుచాను కలిసిన ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేశారు. సత్నాం సింగ్, దేశ్ రాజ్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. జాగీర్ సింగ్ పరారీలో ఉన్నాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు