రెబల్ స్టార్ ఓపీఎస్‌కు లక్షల్లో వస్తే.. పళనికి వందల్లో వచ్చారు.. దీప పార్టీ పేరు మార్చేసింది..?

శనివారం, 13 మే 2017 (16:49 IST)
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వంకు ఊహించని రీతిలో ప్రజల మద్దతు వస్తోంది. శుక్రవారం సేలంలో జరిగిన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పన్నీర్ సెల్వం హుషారుగా ప్రసంగించారు. దివంగత సీఎం జయమ్మ ఎలా మరణించారు.. ఆమెకు అందించిన చికిత్సపై సీబీఐతో దర్యాప్తు చేసేంతవరకు పోరాటం చేస్తానని ఓపీఎస్ ప్రకటించారు. 
 
జయమ్మ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించే వరకు తాను నిద్రపోనని ఓపీఎస్ శపథం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి నిజం అమ్మపై గౌరవం ఉంటే వెంటనే సీబీఐతో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలని ఓపీఎస్ సవాలు వేశారు. తమిళనాట దద్దమ్మ సర్కారు ఉందని పళనిసామిపై ఫైర్ అయ్యారు. సొంతంగా నిర్ణయం తీసుకోలేక.. ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా శశి కుటుంబాన్ని ఎలా రక్షించాలనే తపనతోనే పళని సర్కారు వుందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని.. శశివర్గంతో పోటీ చేసేందుకు తాను రెడీ అని ఓపీఎస్ ధీమా వ్యక్తం చేశారు. 
 
ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మధురైలో శుక్రవారం రాత్రి సీఎం పళనిసామి బహిరంగ సభలో కేవలం వందల్లో కార్యకర్తలు హాజరైతే.. అదే కాంచీపురం, సేలంలలో ఓపీఎస్ నిర్వహించిన సభలకు లక్షమంది కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ఆదరణతో తదుపరి ఎన్నికల్లో ఓపీఎస్‌దే విజయం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 
 
మరోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో పార్టీ స్థాపించి పడవ గుర్తు తెచ్చుకుని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికలు రద్దు అయ్యాయి. తాజాగా దీప పార్టీ పేరు మార్చేసుకున్నారు. తాజాగా తన పార్టీకి ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరు పెట్టేశారు. 
 
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరును అన్నాడీఎంకే దీపా పార్టీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. జయలలిత రాజకీయ వారుసురాలు తానే అంటూ రెండాకుల చిహ్నం కోసం దీపా ఎన్నికల కమిషన్ ఆశ్రయించడానికి రెడీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి