ప్రకాశం జిల్లాలో 2.47 లక్షల యేళ్ళ నాటి రాతి పనిముట్లు

గురువారం, 11 ఆగస్టు 2022 (09:48 IST)
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2.47 లక్షల నాటి (రాతియుగం) రాతిపనిముట్లు బయటపడ్డాయి. 2018లో హనుమంతునిపాడు వద్ద సాగుతున్న పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇవి వెలుగుచూశాయి. ఈ బయల్పడిన రాతి పనిముట్లను సైంటిఫిక్ డేటింగ్ ద్వారా పరిశోధన చేయగా, హోమోసెపియన్స్ కంటే ముందే ఆదిమానవులు ఉన్నారని, వారు వీటిని ఉపయోగించివుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రకాశం జిల్లాలోని కనిగిరి సమీపంలో ఉన్న పాలేరు నదీ తీరంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు గత 2018 నుంచి కొనసాగుతున్నాయి. వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేవర అనిల్ కుమార్ సారథ్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ పనిముట్లను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో సైంటిఫిక్ డేటింగ్ విధానంలో పరిశీలించగా ఇవి 2.47 లక్షల యేళ్ళనాటివని నిపుణులు తేల్చారు. 
 
ఆధునిక మానవులు (హోమోసెపియన్స్) 1.22 లక్షల ఏళ్ళ కిందట ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చారని, వారు తమతోపాటు రాతిపనిముట్లు తెచ్చారన్నది ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్న సిద్ధాంతం. అయితే, అంతకుముందే ఇక్కడ ఆది మానవులు సంచారించాన్నదానికి ప్రకాశం జిల్లాలో లభ్యమైన లక్షల ఏళ్ళనాటి రాతిపనిముట్లే నిదర్శనమని, వాటిని హోమో ఎరక్టస్ జాతి ఆది మానవులు వినియోగించివుంటారని భావిస్తున్నారు. తద్వారా హోమోసెపియన్స్ సిద్ధాంతం తెరమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు