కాలి బొటనవేలితో నుదిటిపై తిలకం దిద్దిన యువతి..

బుధవారం, 28 జూన్ 2023 (11:26 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ యువతి తన కుడికాలి బొటన వేలితో ఆయన నుదిటిపై తిలకందిద్దారు. రాష్ట్రంలోని జలగావ్‌ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఓ యువతి తిలకందిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఇప్పటివరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చెమర్చేలా చేస్తాయి. 
 
ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను’ అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది' అని ఫడ్నవిస్ ట్వీట్‌ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు