14 యేళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తికి తొలుత అనుమతి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు

వరుణ్

మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (13:31 IST)
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా ఈ తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాలతో తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాలిక ప్రయోజనాలే పరమావధిగా పేర్కొన్న సీజేఐ.. ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాలిక గర్భ విచ్ఛిత్తి కోసం బొంబై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేపీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది. 
 
దీనిని అసాధారణ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం బాధితురాలికి సంపూర్ణ మద్దతు అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పును వెలువరిస్తున్నట్లు తెలిపింది. అలాగే ముంబైలోని సియాన్ ఆసుపత్రి బోర్డు నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంది.
 
ఇక సాధారణంగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు