పని చేయలేని అశక్తతతో ఉన్న ముసలి తల్లిదండ్రులను ఇకపై పట్టించుకోకుంటే కబడ్డార్ అంటూ న్యాయస్థానం హెచ్చరించింది. సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మాతృమూర్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగింది. వృద్ధురాలైన తల్లి బాగోగులు పట్టించుకోకపోతే జైలు శిక్ష తప్పదంటూ మధ్యప్రదేశ్లోని గోవింద్పురా ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముకుల్ గుప్తా తీర్పు వెలువరించారు. తల్లికి మెరుగైన సదుపాయాలు కల్పించి, వైద్యంతోపాటు ఇతరత్రా ఖర్చులను భరించాలని ఆమె ఇద్దరు కుమారులను ఆదేశించారు. లేని పక్షంలో జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
విషయానికి వస్తే... భోపాల్కు చెందిన 87 ఏళ్ల వృద్ధురాలు గ్యారసి సాహు తన ఇద్దరు కుమారులపై ఫిర్యాదు చేసింది. భర్త మరణంతో ఒంటరిగా మిగిలిన తనను కుమారులైన రాజేశ్ సాహు(50), నర్మదా సాహు(55) పట్టించుకోలేదని వాపోయింది. నిరాధారంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న తనను చూసుకునేలా కుమారుల్ని ఆదేశించాలని కోరుతూ ఎస్డీఎంకి దరఖాస్తు చేసుకుంది.
2007లో ప్రభుత్వం చేసిన వయోజనుల సంక్షేమ చట్టం అమలుకు సంబంధించిన బాధ్యత ఎస్డీఎందే. ఆమె పిటిషన్ను విచారించిన మెజిస్ట్రేట్ ముకుల్ గుప్తా ప్రతి నెలా రాజేశ్ రూ.8000, నర్మదా సాహు రూ.4000 చొప్పున తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తల్లిదండ్రుల సంక్షేమం మరియు పోషణ , సీనియర్ సిటిజెన్స్ చట్టం - 2007 ప్రకారం కన్నవాళ్లను పట్టించుకోని పిల్లలకు సెక్షన్ 24 కింద మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని జస్టిస్ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. చిన్నకుమారుడు రాజేశ్ గత ఆరు మాసాలుగా తల్లిని పట్టించుకోలేదని, అందుకే అతనికి రెట్టింపు భత్యం ఇవ్వాలని ఆదేశించినట్లు గుప్తా తెలిపారు.