స్టాలిన్‌పై మార్షల్స్ దాడి.. రాజ్‌భవన్‌కు చేరిన పళనిస్వామి బలపరీక్ష వీడియోలు!

మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (10:47 IST)
తమిళనాడు అసెంబ్లీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష సమయంలో సభలో జరిగిన విధ్వంసం, గందరగోళ పరిస్థితులకు సంబంధించిన వీడియోన అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు పంపించారు. 
 
విశ్వాస పరీక్ష సందర్భంగా మార్షల్స్ ముసుగులో ఐపీఎస్‌లో సభలోకి ప్రవేశించి తమపై దాడి చేశారంటూ విపక్ష నేత ఎంకే స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీంతో సభలో జరిగిన అన్ని పరిస్థితులపై సమగ్ర నివేదికతో పాటు.. వీడియో ఫుటేజీని ఇవ్వాలని గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. 
 
దీంతో ఆయన బల పరీక్షకు సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన నివేదికను రాజ్‌భవన్‌కు అందించారు. మరోవైపు బలపరీక్షను అడ్డుకునేందుకు డీఎంకే సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. సభలో జరిగిన గందరగోళం, వాయిదా, డీఎంకే సభ్యులు సభాపతి కుర్చీలో కూర్చోవడం, రికార్డులను, మైకులను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలతో సమగ్ర నివేదిక రూపొందించిన అసెంబ్లీ సచివాలయం దానిని గవర్నర్‌కు అందించినట్టు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి