హోంవర్క్ చూపించమన్నాడనీ... టీచర్‌ను కత్తితో పొడిచిపారేసిన విద్యార్థి

మంగళవారం, 9 జులై 2019 (10:10 IST)
సెలవుల్లో ఇచ్చిన హోం వర్క్ చేశాడో లేదో ఆ టీచర్ విద్యార్థులందరి నోటు పుస్తకాలను తనిఖీ చేసింది. అలాగే, ఓ విద్యార్థిని కూడా హోం వర్క్ చూపించమని కోరింది. ఇంక అంతే... ఆగ్రహంతో రగిలిపోయిన ఆ విద్యార్థి టీచర్‌ను కత్తితో పొడిచిపారేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో శ్రీరాంకృష్ణ అనే పాఠశాల ఉంది. నెల రోజుల సెలవుల తర్వాత సోమవారం స్కూలు తిరిగి ప్రారంభమైంది.‌ సెలవులకు ముందు 11వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ టీచర్ ముకేశ్ కుమారి (45) హోం వర్క్ ఇచ్చింది.
 
సోమవారం స్కూలు ప్రారంభమైన తర్వాత తానిచ్చిన హోం వర్క్ ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకుంటుండగా ఓ విద్యార్థి ఆమెపై పదునైన కత్తితో దాడిచేశాడు. ఆమె పొట్టలో పలుమార్లు విచక్షణ రహితంగా పొడిచాడు. 
 
తీవ్రంగా గాయపడిన టీచర్‌ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాన్పూరులోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (పీజీఐ)కి తరలించారు. టీచర్‌పై దాడిచేసిన విద్యార్థి పారిపోతుండగా మరో టీచర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు