విమానం ఎక్కుతుండగా మహిళకు గుండెపోటు.. అక్కడే మృతి

సోమవారం, 30 అక్టోబరు 2023 (09:16 IST)
ఛండీగఢ్ విమానాశ్రయంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. విమానం ఎక్కుతుండగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె.నర్సింహా భార్య ఇందిరాబాబు (48). డ్వాక్రా ఉద్యోగిని. స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని సీఆర్పీలకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మందిని ఎంపిక చేయగా, వీరిలో ఇందిరాబాబు కూడా ఒకరు. ఈ అవగాహన సదస్సుకు వెళ్లిన ఆమె... సదస్సులను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ నగరానికి తిరుగుపయనమయ్యారు. 
 
వీరంతా ఛండీగఢ్‌ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కుతుండగా, ఆమె ఆకస్మికంగా గుండెపోటు గురయ్యారు. దీంతో ఆమెను ఎయిర్‌పోర్టు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన తక్షణం స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆదివారం ఇందిరాబాబు మృతదేహం గ్రామానికి చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు