ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆలయానికి వెళ్లిన మహిళా జడ్జి మంగళ సూత్రాన్ని కొందరు దొంగరు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కొట్టేశారు. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన పోలీసులు ఓ లేడీ గ్యాంగ్స్టర్ను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ప్రేమ సాహు విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి బృందావన్లోని ఓ ఆలయ సందర్శన కోసం వెళ్లారు. ఆలయంలో దైవదర్శనం చేసుకుంటున్న సమయంలో ఆమె మెడలోని మంగళసూత్రం చోరీకి గురైంది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లో నిఘా పెట్టి, అనుమానితులపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఆలయంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పది మంది మహిళలతో కూడిన ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన మహిళలంతా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని పోలీసులు తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో పర్సులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మథుర, బృందావన్లలో భక్తుల రద్దీ ఎక్కుగా ఉండేఆలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సభ్యులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని జలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.