స్త్రీని గౌరవించాలి, పూజించాలి అని ఎంతోమంది నెత్తి నోరు బాదుకున్నా కూడా నిజానికి అవన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. ఈ శతాబ్దంలోను బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎంతమంది గురజాడ అప్పారావులు వచ్చినా ఇలాంటి వివాహాలను అడ్డుకోలేక పోతున్నారు. స్థోమత లేకనో.. లేదా ఇతరత్రా కారణాల వల్ల ముక్కుపచ్చలారని చిన్నారులను ఎవరో ఒకరికి అంటగట్టాలని వేలం వేసి తమ బిడ్డను అమ్మే తల్లిదండ్రులు ఇంకా ఈ దేశంలో చాలా మంది ఉన్నారు.
అందుకు నిదర్శనమే ఈ ఘటన… రాజస్థాన్లో జుంజును అనే చిన్న గ్రామంలో జరిగిన ఈ ఘటనను వింటే ఇలా కూడా జరుగుతుందాని ముక్కున వేలేసుకుంటారు. ముక్కుపచ్చలారని 13 ఏళ్ల చిన్నారికి పెళ్లి కూతురిలా అలంకరించి ఆమెకు పెళ్లి చేయలేదు. ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా వేలం వేసి అమ్మేశారు. దాదాపు ఎనిమిది మంది పురుషులు ఈ వేలానికి హాడరయ్యారు. ఆ వేలంలో పాల్గొన్న వారు పెళ్లి కొడుకు దుస్తులు ధరించి మరీ వచ్చారు.
ఇంతకీ ఆ పెళ్లికొడుకు వయస్సు ఎంతో తెలుసా..? సుమారు 35 నుంచి 38 వరకు ఉంటారు. రూ.30 వేలతో ప్రారంభమైన చిన్నారి వేలంపాట.. చివరకు రూ.1.15 లక్షల వరకు చేరింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే...ఎంతో రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ పెద్ద మనుషులు.. చివరికి ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.