చైనాతో చర్చలు ఫలిస్తాయన్న విశ్వాసం లేదు: రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్

శుక్రవారం, 17 జులై 2020 (17:31 IST)
సరిహద్దు వివాదంపై చైనాతో జరుగుతున్న చర్చల ఫలితంపై మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పెదవి విరిచారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని వుందని, అయితే చర్చలు ఫలిస్తాయన్న విశ్వాసం లేదన్నారు.

నెల రోజుల తర్వాత మళ్లీ లఢక్‌ వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులను కలిసి వారి నుద్దేశించి మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు సమస్యను పరిష్కరించడానికే జరిగాయని, అయితే దానిపై గ్యారంటీ ఏమీ లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. భారత్‌ భూబాగం నుండి ఒక్క అంగుళం భూమిని కూడా ఏ దేశమూ తీసుకు పోలేదని హామీ ఇచ్చారు.

పాంగాంగ్‌ సరస్సు దగ్గరలోని లుకుంగ్‌ పోస్ట్‌ను సదర్శించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ పై వ్యాఖ్యలు చేశారు. రాజ్‌నాథ్‌ రెండు రోజుల పర్యటన కోసం లఢక్‌, జమ్ము కాశ్మీర్‌ వెళ్లారు.

ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రపంచంలో ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని, ఏ దేశంపైన భారత్‌ దండెత్తలేదని, ఏ దేశపు భూబాగాన్ని తమదిగా చెప్పుకోలేదని, వసుధైక కుటుంబం అనే భావనపై భారత్‌కు నమ్ముకముందని రాజ్‌నాథ్‌ అన్నారు.

అశాంతిని భారత్‌ కోరుకోదని, ఏ దేశపు గౌరవాన్ని కించపరచదని, అలాగని భారత దేశ గౌరవాన్ని కించపరిచేలా ఎవరైనా ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు