రైతులకు ఏమీ తెలియదు.. వారిని కొందరు ఉసిగొల్పుతున్నారు : హేమమాలిని

బుధవారం, 13 జనవరి 2021 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న అనేక మంది రైతులు ప్రాణాలు విడిచారు. రైతులు పడుతున్న పాట్లు చూసిన సుప్రీంకోర్టు ఈ సాగు చట్టాల అమలుకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై బాలీవుడ్ నటి, బీజేపీ రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని స్పందించారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులను ఉసిగొల్పుతున్నారని, చట్టాల అమలు వల్ల వచ్చే నష్టాలేంటో రైతులకు తెలియవన్నారు. 'చట్టాలపై సుప్రీం స్టే విధించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతమున్న వాతావరణాన్ని కాస్త మెరుగుపరుస్తుందని నా అభిప్రాయం. ఇన్నిసార్లు చర్చలు జరిగినా, రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదు. వారికి ఏం కావాలో కూడా వారికి తెలియదు. అంతేకాకుండా నూతన చట్టాలతో వచ్చే నష్టాలేంటో కూడా వారికి తెలియదు. ఎవరో కొందరు వ్యక్తులు నిరసన చేయమంటే రైతులు చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఈ చట్టాలు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే, ఈ విషయంలో ప్రభుత్వ వాదనలన్నింటినీ పక్కకు పెట్టిన కోర్టు - చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించి సమస్యకు ఓ పరిష్కారం సాధించేందుకు నలుగురు నిపుణులతో ఓ కమిటీని వేసింది. 
 
ప్రభుత్వంతో పాటు ఆందోళన చేస్తున్న లేదా చేయని రైతు సంఘాలన్నింటితో సంప్రదింపులు జరిపి రెండు నెలల్లోగా ఓ నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు