నకిలీ పాత్రికేయులతో సమాజానికి ముప్పు : మద్రాస్ హైకోర్టు

సోమవారం, 30 ఆగస్టు 2021 (09:33 IST)
చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులకు పాల్పడే నకిలీ జర్నలిస్టులను తొలగించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు'(పీసీటీఎన్) ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 
 
నిజమైన జర్నలిస్టుల ప్రయోజనాలను కాపాడటానికి, పారిశ్రామికవేత్తలు,వ్యాపా రులను బ్లాక్మెయిల్ చేయడం వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించ డానికి పీసీటీఎన్ ఏర్పాటు అవసరమని పేర్కొంది. 
 
విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక విభాగంలో అధికారిగా ఉన్న పొన్ మాణిక్యవేల్ తప్పుడు నివేదికలను దాఖలు చేయడంపై సిట్తో విచారణ చేయించాలని చెన్నైకి చెందిన శేఖర్రామ్ అనే వ్యక్తి తనను తాను జర్నలిస్టుగా పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.      
 
అతడు నకిలీ జర్నలిస్టు అని మాణిక్యవేల్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసు విచారణకు రాగా..గుర్తింపు పొందిన మీడియాలోని సీనియర్ జర్నలిస్టులు,పదవీ విరమణ చేసిన ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉండాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.               
 
ప్రెస్ కౌన్సిల్ ద్వారానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ఉచిత బస్ పాస్ వంటి ప్రయోజనాలను అందించాలని తెలిపింది. నకిలీ జర్నలిస్టులు పౌర సమాజానికి ముప్పని, వారిపై క్రిమినల్ చర్యలను చేపట్టాలంది. 
 
పత్రికా సంస్థ ఉద్యోగుల సంఖ్య,వారికి చెల్లించిన జీతాలు,పన్ను మినహాయింపు,పన్ను చెల్లింపు వివరాలను వెల్లడించకపోతే ప్రెస్ స్టిక్కర్లు,గుర్తింపు కార్డులు,ఇతర ప్రయోజనాలను జారీ చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు ఆదేశించారు. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధన లను మూడు నెలల్లో సవరించాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు