బాలికలపై అత్యాచారం: రాత్రి పొద్దుపోయినా బీచ్ వద్ద మీ పిల్లలు ఎందుకున్నారు? మంత్రి ప్రశ్న

శనివారం, 31 జులై 2021 (13:18 IST)
వారం వ్యవధిలో మూడు రేప్ కేసులు, వాటిపై రాష్ట్ర మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 
దక్షిణ గోవా బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ క్రమంలో మంత్రిగారు ఇద్దరు మైనర్ బాలికల తల్లిదండ్రులను నిందించారు. తల్లిదండ్రులు తమ మైనర్ బాలికలను చీకటి పడిన తర్వాత బీచ్‌లలో తిరుగుతుంటే ఏం చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని, గోవా కళలు- సాంస్కృతిక శాఖ మంత్రి గోవింద్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం దుమారం రేపాయి.
 
"ఇలా పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తే ప్రతి వ్యక్తికి, ప్రతి అమ్మాయికి ఒక పోలీసుని నియమించవలసి వస్తుంది. అలాంటప్పుడు మనకు ఎంతమంది పోలీసులు కావాలి? ప్రభుత్వం బాధ్యత నుండి పారిపోదు. ప్రభుత్వం అందరినీ కాపాడుతోంది. ప్రభుత్వం ప్రజల కోసమే వుంది" అని గౌడ్ రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.
 
తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో చూడాలి, పిల్లలు ఎవరి వద్దైనా ఉంటున్నారా అని ఆరా తీయాలి. పెద్దల అనుమతి లేకుండా పిల్లలు బయట ఎలా తిరుగుతారు. ఏం పట్టించుకోరా? బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.
 
దక్షిణ గోవాలోని కోల్వా బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. వారంలోనే మరో రెండు అత్యాచారాలు నమోదయ్యాయి. పోండా జిల్లాలో 19 ఏళ్ల బాలికపై ట్రక్ డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మరొక సంఘటనలో, 25 ఏళ్ల అస్సామీ మహిళపై ఇద్దరు వ్యక్తులు మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆమె ఉద్యోగ నిమిత్తం గోవాకు వెళ్లింది. "ఇది సిగ్గుచేటు. గోవాలో పోలీసు యంత్రాంగం అసలు వుందా" అని ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు