పార్కుకు వచ్చిన జంట పాలిట కీచకులైన పోలీసులు.. లైంగిక వేధింపులు..

మంగళవారం, 3 అక్టోబరు 2023 (10:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మహిళపై జరుగుతున్న నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళలతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పార్కుకు వచ్చిన ఓ జంటను పోలీసులు తీవ్రంగా వేధించారు. డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పంపుతామని బెదిరించారు. దీంతో యువకుడి ఖాతా నుంచి అప్పటికపుడు రూ.10 వేలు పోలీసుల ఖాతాకు బదిలీ చేశారు. ఆ డబ్బులు చాలవని, మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ వేధించసాగారు. పైగా, ఆ యువతిని కూడా లైంగికంగా వేధించారు. యువతికి ఫోన్ చేసి ఈ వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితులైన పోలీసులు పరారీలో ఉన్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బలంద్‌షహర్‌కు చెందిన యువతీయువకులు త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. ఈ క్రంమలో సరదాగా గడిపేందుకు పార్కుకు వెళ్లారు. వారిని చూసిన ముగ్గురు పోలీసులు రూ.10 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే జైలుకు పంపుతామని బెదిరించారు. అయితే, తాము పెళ్లి చేసుకోబోతున్నామని అందువల్ల తమను వదిలిపెట్టాలంటూ వారు ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదు. దీంతో యువకుడి ఖాతా నుంచి రూ.10 వేలు తమ ఖాతాల్లోకి బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అక్కడితో ఆగకుండా మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. 
 
పైగా, ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెకు నిత్యం ఫోన్ చేసి లైంగికంగా వేధించసాగారు. చివరకు ఆమెను కలిసేందుకు ఇంటికి కూడా వెళ్లారు. వారి ఆగడాలు మితిమీరిపోవడంతో భరించలేని ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్‌గా గుర్తించగా, మరో వ్యక్తిని గుర్తించాల్సివుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు