కారులో ఎయిర్‌బ్యాగులు మిస్సింగ్.. ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:46 IST)
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కేసు నమోదైంది. కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఆయనపై ఈ కేసును కాన్పూర్ పోలీసులు నమోదు చేశారు. కొత్తగా కొనుగోలు చేసిన స్కార్పియో కారులోని ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోని కారణంగా తన కుమారుడు మరణించాడంటూ రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. ఇందులో ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిసీలిస్తే, రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి గత 2020లో తన కుమారుడు అపూర్వకు రూ.17.39 లక్షలు వెచ్చించి స్కార్పియో కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ కారు 2022 జనవరి 14వ తేదీన అపూర్వ, తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో మంచు ఎక్కువగా ఉండటంతో ఎదురుగా ఉన్న రోడ్డు సరిగా కనబడక పోవడంతో అపూర్వ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అపూర్వ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ప్రమాదం అనంతరం షోరూంకు వెళ్లిన మిశ్రా కారులోని లోపాల కారణంగానే తన కుమారుడు మరణించాడని ఆరోపించారు. తన కుమారుడు సీట్ బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని ఫిర్యాదు చేశారు. కారు భద్రత విషయంలో కంపెనీ తనను మోసం చేసిందని వాపోయారు. సంస్థ తప్పుడు విధానాలను అవలంబించిందని పేర్కొన్నారు. అసలు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయలేదని కూడా వెల్లడించారు. అమ్మకానికి ముందే కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.
 
ఈ క్రమంలో షోరూం సిబ్బంది రాజేశ్‌తో వాగ్వాదానికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ డైరెక్టర్ల ఆదేశాల మేరకు సంస్థ మేనేజర్లు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా రాజేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12 మందిపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 287, సెక్షన్ 304ఏ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు