ఆవును కొట్టాడనీ భార్యాపిల్లల ముందే వ్యక్తిని కొట్టి చంపేశారు.. ఎక్కడ?

మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:23 IST)
తన ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఓ వ్యక్తి కర్రతో కొట్టాడు. దీన్ని ఆవు యజమాని చూశాడు. అంతే.. ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అంతే.. ఆవును కొట్టిన వ్యక్తిని పట్టుకుని అతని భార్యాపిల్లల ముందే కొట్టి చంపేశారు. ఈ దారుణం కాన్పూరులో జరిగింది. 
 
తాజాగా దారుణానికి సంబంధించి గోవింద్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని మహదేవ్ నగర్ బస్తీలో ఆయుష్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన గోవు, రమణ గుప్తా (46) అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చింది. 
 
ఆ సమయంలో గుప్తా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వారు భయపడుతుండటంతో, ఓ కర్రను చేతపట్టుకుని గోవును అదిలిస్తూ కొట్టాడు. ఈ ఘటనను చూసిన ఆయుష్ యాదవ్, రమణ గుప్తాతో గొడవకు దిగాడు. 
 
ఆపై కర్ర తీసుకుని వచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో రమణ గుప్తా తీవ్రంగా గాయపడగా, బంధువులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ప్రధాన నిందితుడు ఆయుష్ యాదవ్ తన కుటుంబంతో సహా పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య స్పందిస్తూ, చిన్న కారణానికే తన భర్తను హత్య చేశారని బోరున విలపిస్తూ వాపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు