యూపీ మంత్రిని కాటేసిన కరోనా... ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు మృతి

బుధవారం, 19 మే 2021 (07:57 IST)
కరోనా వైరస్ దేశంలో మరణమృదంగం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి ప్రజలే కాదు.. వీఐపీలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 56 యేళ్లు. 
 
ఈయన ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. విజయ్ కశ్యప్‌తో కలిపి యూపీలో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు కరోనాతో మృతి చెందారు.
 
గతేడాది మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ కరోనాతో మృతి చెందారు. విజయ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి మరణించిన బీజేపీ ఎమ్మెల్యేలలో విజయ్ కశ్యప్ ఐదోవారు.
 
అంతకుముందు సలోన్ శాసనసభ్యుడు దాల్ బహదూర్ కోరి, నవాబ్‌‌గంజ్ శాసనసభ్యుడు కేసర్ సింగ్ గంగ్వార్, ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీవాస్తవ కరోనాకు బలయ్యారు. శ్రీవాస్తవ భార్య కూడా కరోనా కారణంగా మృతి చెందారు. 
 
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. వారికి సరైన వైద్య సదుపాయాలు అందక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అధ్వాన్నపు పరిస్థితులపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ప్రజలు రాముడే కాపాడాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు