ఖత్రోం కా ఖిలాడీ స్టంట్ చేయబోయి.. నదిలో దూకాడు.. కనిపించకుండా పోయాడు..

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (17:02 IST)
సోషల్ మీడియాలో సెల్ఫీలు, వీడియోలు అప్ చేయడం ప్రస్తుతం ట్రెండ్. తాజాగా టీవీలో వచ్చిన ఓ ప్రోగ్రామ్‌లో కనిపించిన ఓ స్టంట్ కాపీ చేయబోయిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని విద్యాసాగర్ సేతు బ్రిడ్జి మీద నుంచి ఇద్దరి యువకులు హుగ్లీ నదిలోకి దూకారు. కలర్స్ టీవీలో వచ్చే "ఖత్రోం కా ఖిలాడీ" ప్రోగ్రామ్‌లో చూపించిన ఓ స్టంట్ చేయడం కోసం వీరిద్దరూ నదిలోకి దూకేశారట. దానిని వీడియో కూడా తీశారు. 
 
ఆ వీడియోలో కొంతమంది యువకులు వెల్‌కమ్ టూ ఖత్రోం కా ఖిలాడీ, అని అరుస్తుండటం.. మరికొందరు ఏమో "రాజా గో ఫాస్ట్" అంటూ యువకులను ఉత్సాహపరిచారు. అయితే, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. 
 
స్టంట్ పక్కన పెడితే.. నదిలోకి దూకిన ఇద్దరి యువకుల్లో ఒకరు కనిపించకుండా పోయాడు. కన్పించకుండా పోయిన యువకుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
కనిపించకుండా పోయిన యువకుడి కోసం ప్రస్తుతం రివర్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు