ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:28 IST)
పంచాయతీ ఎన్నికల్లో పిర్యాదుల కోసం ఎస్‌ఈసీ రూపొందించిన ఈ-వాచ్ యాప్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ  హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. 
 
భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. 
 
సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా ఈ-వాచ్‌ యాప్‌ ఎందుకని ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ది చేకూర్చేలా యాప్‌ ఉందన్న ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
 
అంతకుముందు...  ‘ఈ-వాచ్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ ఆవిష్కరించారు.  ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. 
 
ఫిర్యాదులను పరిష్కరించిన అనంత‌రం ఆ వివ‌రాల‌ను ఫిర్యాదుదారుల‌కు చెబుతామని పేర్కొన్నారు. ఈ యాప్ రేప‌టి నుంచి ప్లేస్టోర్‌లో  అందుబాటులో ఉంటుందని వివ‌రించారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పారదర్శకత, ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే దీన్ని విడ‌దుల చేస్తున్నామ‌ని వివ‌రించారు. 
 
స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌ర్లంతా సొంత గ్రామాలకు వచ్చి ఓట్లెయ్యాలని ఆయ‌న పిలుపునిచ్చారు. కాగా, ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్‌ సెంటర్‌ని కూడా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు