కమల్ హాసన్‌పై పళని ఫైర్ : కమల్‌కు విశాల్ మద్దతు.. అలా అనడంలో తప్పేముంది?

గురువారం, 16 మార్చి 2017 (11:29 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయలు రోత పుట్టిస్తున్నాయి. అమ్మ మరణానికి అనంతరం శశికళ సీన్లోకి రావడంతో ప్రజలు రాజకీయాలంటేనే ఛీ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు పరోక్షంగా చెప్పేశారు. ఇలాంటి తరుణంలో కమల్ హాసన్‌కు రాజకీయ పరంగా సమస్యలు తలెత్తితే ఆయనకు అండగా నడిగర్ సంఘం నిలుస్తుందని పేర్కొన్నారు.
 
తమిళ రాజకీయ పరిణామాలపై కమల్ స్పందించారు. తమిళనాడులో వెంటనే ఎన్నికలు జరగాలంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై సీఎం పళని స్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. 65 ఏళ్ల తరువాత కమల్ హాసన్‌కు జ్ఞానోదయం అయ్యిందంటూ ఎడప్పాడి పళనిసామి వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. 
 
మరోవైపు కమల్ హాసన్ హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని హిందూ మక్కల్ కట్చి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి మాట్లాడిన కమల్ హాసన్ హిందూవులను కించపరిచారని ఆరోపిస్తున్నారు.
 
మొత్తం మీద జయలలిత మరణించిన తరువాత కమల్ హాసన్ చేస్తున్న వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ నాయకులకు దడపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌కు నడిగర్ సంఘం అండగా నిలిచింది. కమల్ హాసన్ ఇటీవల మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని విశాల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి