గర్భంలో ఉన్నది ఆడో మగో తెలియాలి... కడుపును నిలువునా చీల్చిన భర్త...

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (13:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హేయమైన దారుణం జరిగింది. ఓ మహిళ గర్భందాల్చింది. కానీ, ఆమె కడుపులో పెరుగుతున్నది ఆడో మగో తెలియాల్సిందేనంటూ కట్టుకున్న భర్త ఘోరాతిఘోరానికి పాల్పడ్డారు. కడుపును కత్తితో నిలువునా చీల్చేశాడు. ఈ దారుణం యూపీలోని బడోవ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బడోవ్ జిల్లాకు చెందిన పన్నాలాల్ అనే వ్యక్తి అప్పటికే ఐదుగురు ఆడపిల్లలకు తండ్రి. ఈక్రమంలో అతని భార్య మరోమారు గర్భందాల్చింది. ఆమెకు నెలలు నిండుతున్న క్రమంలో గర్భంలో పెరుగుతున్నది ఆడో మగో తెలియాల్సిందేనంటూ భర్త పట్టుబట్టాడు. అంతటితో ఆగని ఆ కసాయి.. గర్భంతో ఉన్న భార్య కడుపును కత్తితో నిలువునా చీల్చేశాడు. దీంతో గర్భవతి అక్కడే కుప్పకూలిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. "పన్నాలాల్‌కు ఎప్పటినుంచీ తనకో కొడుకు కావాలని కోరుకుంటున్నాడు. పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలుసుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు" అని బాధితురాలి తరఫు బంధువులు ఆరోపించారు.
 
ఇంతటి దారుణానికి ఒడిగట్టటానికి కారణమేమిటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఏడు నెలల గర్భవతి అని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమె బరేలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు