శశికళను కలిస్తే బహిష్కరణ వేటే : మంత్రి జయకుమార్

మంగళవారం, 19 జనవరి 2021 (09:06 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న ఆమె ప్రియనెచ్చెలి శశికళా నటరాజన్ త్వరలోనే బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలకానున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైతే.. అన్నాడీఎంకే నేతలంగా ఆమెవైపు వెళ్లిపోతారనే ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై సీనియర్ మంత్రి డి.జయకుమార్ స్పందించారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక కూడా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించబోవని స్పష్టం చేశారు. శశికళ, ఆమె బంధువులు, మద్దతుదారుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని జయకుమార్ తెలిపారు. 
 
శశికళ కుటుంబం వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయని, ఆ సొమ్ముతో కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే, శశికళ వెంట పార్టీ నేతలు ఎవరూ వెళ్లే అవకాశం లేదని తెగేసి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై మాత్రం వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు