దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలోని జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె ఆశ్చర్యకరంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో హల్చల్ చేశారు. రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలకలం సృష్టించడం గమనార్హం.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ యూట్యూబర్గా కొనసాగుతూనే పాకిస్థాన్ గుఢచార సంస్థ ఐఎస్ఐకు ఏజెంట్గా పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించారు. భారత సైనిక దళాలకు చెందిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఈమె పాకిస్థాన్కు చేరవేస్తున్నట్టు నిర్ధారణ కావడంతో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరో ఆరుగురుని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. జ్యోతి ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో కూడా పర్యటించినట్టు సమాచారం.
సుమారు రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో జ్యోతి మల్హోత్రా హంగామా చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించివేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.