8 సార్లు అబార్షన్‌ చేయించారని... 1500 స్టెరాయిడ్స్‌ ఎక్కించారు.. అబ్బాయి పుట్టాలని..?

బుధవారం, 18 ఆగస్టు 2021 (18:13 IST)
ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలకు మాత్రం కొదువలేదు. తాజాగా ముంబైలోని ఓ విద్యావంతుల కుటుంబం ఆ ఇంటి కోడలిని శారీరకంగా, మానసికంగా హింసించిన ఘటన వెలుగుచూసింది. ఎనిమిది సార్లు ఆమెకు అబార్షన్‌ చేయించారు. ఏకంగా 1500 స్టెరాయిడ్లు ఇచ్చారు. ఇదంతా మగపిల్లాడు పుట్టాలని చేశారు. చివరికి ఆ బాధితురాలు వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకెళితే... ముంబైకి చెందిన ఓ మహిళ (40)కు 2007లో.. అదే నగరంలోని దాదర్‌ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆమె అత్త, భర్త ఇద్దరూ న్యాయవాదులు. భర్త సోదరి వైద్యురాలు. ఉన్నత కుటుంబం కావడంతో తమ బిడ్డ జీవితం సాఫీగా సాగుతుందని తండ్రి భావించాడు. కానీ ఆమెకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. 2009లో మొదటి కాన్పులో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2011లో మరోసారి గర్భం దాల్చింది. 
 
తనకు వారసుడే కావాలంటూ భర్త అబార్షన్‌ చేయించాడు. మరోవైపు తానూ కూడా చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్‌, లింగ నిర్ధారణ తదితర అంశాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. 
 
ఈ క్రమంలో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు చేయించాడు. రకరకాల శస్త్రచికిత్సలు చేయించారు. మగబిడ్డనే కనాలని ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారు.
 
చివరికి భర్త, అత్తింటివారు చూపిస్తున్న నరకాన్ని తట్టుకోలేక ఆ మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా, తన శరీరాన్ని అత్తింటివారు, భర్త కలిసి ఓ ప్రయోగశాలగా మార్చేశారని వాపోయింది. తన అనుమతి లేకుండానే 8 సార్లు అబార్షన్‌ చేయించారని... 1500 స్టెరాయిడ్స్‌ ఎక్కించారని ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగుచూసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మగబిడ్డ కోసం భ్రూణహత్యలకు పాల్పడిన అతడిపై మహిళాలోకం మండిపడుతుంది. మరోసారి ఎవ్వరూ ఇలాంటి పనిచేయకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు