వరకట్న వేధింపులు.. డాక్టర్‌ను పెళ్లాడిన పాపం.. యువతిని కొట్టి చంపేశారు..

గురువారం, 20 జులై 2017 (17:07 IST)
వరకట్న వేధింపులతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని మన్నార్గుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లా మన్నార్గుడికి చెందిన ఇళంచేరన్.. తిరుచ్చిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రిటైర్డ్ వీఏఓ కార్తీకేయన్ కుమార్తె దివ్యాతో గత 2013వ సంవత్సరం వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
దివ్యకు వివాహం సందర్భంగా 100 తులాల బంగారం రూ.పది లక్షల నగదు, అర కేజీ వెండి, ఇంటికి అవసరమయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులను కట్నంగా ఇచ్చారు. అయితే తన కుమారుడు డాక్టర్ కావడంతో ఇంకా అధికంగా కట్నం తేవాలని ఇళంచేరన్ తల్లిదండ్రులు దివ్యను ఒత్తిడి చేశారు. దివ్యను కూడా కట్నం కోసం వేధించారు.
 
ఈ నేపథ్యంలో బుధవారం ఇంటికొచ్చిన ఇళంచేరన్ తన భార్య దివ్య అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించి.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే దివ్య ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేగాకుండా దివ్య ముఖంపై రక్తపు మరకలు, గాయాలున్నట్లు.. ఇళంచేరన్ తల్లిదండ్రులు దివ్యను కొట్టి చంపేశారని వారిని అరెస్ట్ చేయాలని దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
విచారణలో దివ్యను కొట్టడం ద్వారానే ఆమె అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. దీంతో దివ్య భర్క ఇళంచేరన్, అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. ఆపై 15 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి