మా నాన్న శవాన్ని తెప్పించరూ... ప్లీజ్..!!

జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని సౌదీకి వెళ్లిన మహ్మద్ షాబుద్దీన్... అక్కడ జీతం లేక, ఆకలి తీరక, అర్ధాకలితో మరణించిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా మద్దూరు మండలం, అర్జునపట్ల గ్రామానికి చెందిన షాబుద్దీన్ మృతదేహం కోసం వెళ్లిన ఆయన పెద్ద కుమారుడు షాదుల్లా... తన తండ్రి శవాన్ని ఎలాగైనా సరే సొంతగడ్డకు తెప్పించాలని అధికారులను వేడుకుంటున్నాడు.

తండ్రి మృతదేహాన్ని తీసుకురావాలని సౌదీ అరేబియా వెళ్లిన షాదుల్లా గురువారం తిరిగీ అర్జునపట్లకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... తండ్రి మరణ వార్తను కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని సౌదీలోని కింగ్‌పహద్ ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.

ఆసుపత్రిలో 20 శవాలున్నాయని... ఇందులో మీ నాన్న శవం ఇదేనన్న గ్యారంటీ ఏంటి.. ఎలాంటి ఆధారం లేకుండా శవాన్ని ఎలా అప్పజెప్పాలని ఆసుపత్రి వర్గాలు తన తండ్రి శవాన్న ఇచ్చేందుకు నిరాకరించాయని షాదుల్లా విలపించాడు. అలాంటి పరిస్థితుల్లో చేసేదేమీలేక ఇంటిముఖం పట్టానని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కుటుంబ నిస్సహాయతను, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని తన తండ్రి షాబుద్దీన్ శవాన్ని స్వదేశానికి తెప్పించి, తమకు అప్పగించాలని షాదుల్లా కన్నీటితో వేడుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి