ఇల్లినాయిస్ వర్సిటీ అక్రమాలు : ఎన్నారై రాజీనామా

షికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రవాస భారతీయుడు నిరంజన్ షా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విశ్వవిద్యాలయం ప్రవేశాలలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు రావడంతో మనస్తాపం చెందిన షా తన పదవినుంచి తప్పుకున్నారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇల్లినాయిస్ గవర్నర్‌కు పంపించిన నిరంజన్ షా... తన గౌరవానికి భంగం కలిగించేంతగా ఆరోపణలు రావడంతో కలత చెందిన తాను ఈ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కళంకపు ఆరోపణలతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాసేవ చేయలేనని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే... నిరంజన్ షా రాజీనామాను ఇల్లినాయిస్ గవర్నర్ ఆమోదించారు. త్వరలోనే ఆ పదవికి మరో అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు గవర్నర్ వెల్లడించారు. కాగా... 2003వ సంవత్సరం నుంచి షా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2007లో సమీప బంధువులకు వర్సిటీలో ఉద్యోగంతోపాటు, మూడుసార్లు తిరస్కరణకు గురైన ఓ భారతీయ విద్యార్థికి ప్రవేశం కల్పించినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

వెబ్దునియా పై చదవండి