ఫ్లోరిడాలో "స్పందన" ఛారిటీ క్రికెట్ టోర్నమెంట్

ఫ్లోరిడాలోని వెస్ట్ పాల్మ్ బీచ్‌లో "స్పందన ఫౌండేషన్" సంస్థ నిర్వహించిన ఛారిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు విశేషమైన స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్‌‌లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆటగాళ్ళే కాకుండా, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే సహృదయులు, క్రికెట్ అభిమానులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్పందన ఫౌండేషన్ నార్త్ అమెరికాలో ప్రవాసాంధ్రుల ద్వారా నిధుల సేకరణ చేపట్టి... అలా సేకరించిన నిధులను ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం వినియోగిస్తోంది. ఇలా 2008-09 విద్యా సంవత్సరానికి సేకరించిన నిధులతో ఆంధ్రలోని 18 జిల్లాలలో 138 మంది ఎన్నారైల ద్వారా... వారి స్వస్థలాల్లో 138 ప్రభుత్వ పాఠశాలల్లో 2 వేల మంది విద్యార్థులకు సహాయం చేశారు.

ఈ సందర్భంగా స్పందన కార్యదర్శి గోవర్ధన్ గాల్పల్లి మాట్లాడుతూ.... ఈ సంవత్సరం కూడా ప్రతిభ ప్రాజెక్టు కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన ప్రతిభావంతులయిన పేద విద్యార్థులను చదివించేందుకుగానూ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది కూడా నార్త్ అమెరికాలోని ప్రతీ నగరంలో నిధుల సేకరణ కోసం క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

అలాగే, స్పందన ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు నిడమనూరి మాట్లాడుతూ... పేద విద్యార్థులకు సహాయం చేయాలనుకునే ఎన్నారైలు తమను సంప్రదించవచ్చునని తెలియజేశారు. కాగా... ఫ్లోరిడా క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన వారికి శ్రీని బల్మూరి, కిరణ్ నిడమనూరు, హరి ముత్తుస్వామి ట్రోఫీలను అందజేశారు.

వెబ్దునియా పై చదవండి