"షా ఆలమ్" కేసు : ఆరుగురిపై అభియోగాలు

మలేషియాలోని షా ఆలమ్‌లో హిందూ దేవాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన కేసులో ఆరుగురు ముస్లింలపై విద్రోహం నేరం కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన మరో ఆరుగురిపై చట్ట వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారన్న నేరంకింద అభియోగాలు నమోదు చేశారు.

కాగా... షా ఆలమ్ కేసులో అభియోగాలు మోపబడ్డ 12 మందిని విచారించిన మలేషియా కోర్టు 4వేల రింగిట్ల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 21వ తేదీన జరగనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

ఇదిలా ఉంటే... శతాబ్దాల చరిత్ర కలిగిన హిందూ దేవాలయం పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సెక్షన్ 23 ప్రాంతానికి చెందిన ముస్లింలు గత ఆగస్టు 28వ తేదీన షా ఆలమ్ సెక్రటేరియట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటంతో ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. దాంతో మలేషియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి