ఎన్నారై మహిళపై ఫోర్జరీ కేసు

ప్రభుత్వాన్ని మోసగించి సుమారు లక్ష పౌండ్ల సహాయాన్ని పొందారన్న నేరారోపణతో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు తన భాగస్వామితో కలిసి బ్రిటన్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. శశి బచెతా అనే 52 సంవత్సరాల మహిళ, ఆమె భాగస్వామి జెఫ్రీ కోల్స్ (58)లు ఈ మోసానికి పాల్పడినట్లు లండన్ ప్రభుత్వం వెల్లడించింది.

2002-08 సంవత్సరాల మధ్య కాలంలో శశి, జెఫ్రీలు పై అక్రమాలకు పాల్పడ్డారంటూ... గత సంవత్సరం జనవరి నెలలో బ్రిటన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జైలుశిక్షపై తీర్పును వాయిదా వేసింది. కాగా, వీరిరువురికీ మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉండగా, ప్రస్తుతం నిందితులు బెయిల్‌పై విడుదలయినట్లు ఆ దేశ వర్గాలు ఉటంకించాయి.

ఇదిలా ఉంటే... లండన్ నగరంలోనే భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మారుతి విచారణ కమిటీ అధ్యక్షుడు స్వర్గీయ అలక్ చంద్రగుప్తా సతీమణి షీలా గుప్తా కన్నుమూశారు. కాగా, ఆమె వయస్సు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బ్రిటన్‌లోని గిల్డ్‌ఫోర్డ్‌లో ఉన్న రాయల్ సర్రీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం షీలా లండన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి