సూర్యుడి వేడి భరించలేని ఆమె తన రూపంతో ఛాయాదేవిని సృష్టించి తన స్థానంలో ఆమెను ఉంచి తాను వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగింది. సూర్యుడికి ఛాయాదేవిలకు శ్రుతశ్రవస్, శృతకర్మ అనే పుత్రులు, తపతి అనే పుత్రిక జన్మించారు. అందులో శృతకర్మయే శనైశ్చరుడు. ఆయన మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది.
శనైశ్చరుడు భూలోకం చేరి కాశీ క్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి నవగ్రహాల్లో స్థానం పొందాడు. శనైశ్చరుడు నలుపు వర్ణంతో.. పొట్టిగా ఉంటాడు. ఈయన వాదనలు కలుగజేసే గుణం కలిగిన వాడు. దిక్కుల్లో పడమర, దేవతలలో యముడు, లోహాలలో ఇనుము, రాళ్ళల్లో నీలం, ధాన్యాలలో నువ్వులు, సమిధలలో జమ్మి, రుచుల్లో పులుపు, వస్త్రాల్లో నలుపురంగు శనైశ్చరుడికి ప్రియమైనవి. ఆయన వాహనం కాకి. ఈ స్వామిని శనివారం నాడు ఆరాధించడం శ్రేష్టం. అందుకు శనిత్రయోదశి మరింత ప్రశస్తమైనది.