జూన్ 27న వటసావిత్రి వ్రతం చేస్తే.. సౌభాగ్యం...

సోమవారం, 11 జూన్ 2018 (11:47 IST)
ఈ వ్రతం జ్యేష్ఠ పూర్ణమనాడు ఆచరిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజునే ప్రదోషకాలంలో ఆరంభిస్తారు. కొందరు జ్యేష్ఠ అమావాస్యకు చేస్తారు. స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవాడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షంతో పూజచేయడం మంచిది.
 
వటవృక్షం అనగా మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. ఈ వ్రతం రోజు సుమంగళులు వటవృక్షానికి పసుపు, కుంకుమలతో, అక్షతలతో పూజిస్తే మంచిది. వటవృక్షాన్ని పువ్వులతో అలంకరించి గాజులు మెుదలైన అలంకరణ సామాగ్రిని సమర్పించి ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి.
 
తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షణలు చేస్తూ ముడిప్రత్తి నుండి వడికి తీసిన దారాన్ని వృక్షం చుట్టూ చుట్టుకుంటూ వెళ్ళాలి. వటవృక్షం యెుక్క దీర్ఘాయుర్దాయంతో తమ భర్తల ఆయుష్షును బంధించడమే ఇలా దారం చుట్టడంలోని అంతరార్థం. జనన మరణాలు కాలం మీద ఆధారపడి ఉంటాయి.

కాబట్టి కాలాన్ని బంధించే భావనతో ఇలా దారాన్ని చుట్టడం జరుగుతోందని కూడా అనుకోవచ్చును. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసటన బొట్టు పెట్టించుకోవాలి. సౌభాగ్యం, సంతానవృద్ధి, సిరిసంపదల కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు