హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడా తలంపు విడిచాడు. తర్వాత బాబా అతణ్ణి చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి. కష్టానికి వెరచేవాడు సన్యాసేగాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. రెండు రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబొచ్చింది. వెంటనే అతడు ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు. వసతి గృహంలో ద్వారాలు బంధించి, ఓర్పుతో, జాగ్రత్తగా వేచివుండు.
దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము, శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి. కృతార్ధుడవవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకుని లెండిలో పారాయణ పూర్తి చేశాక మూడవరోజున తన గదిలోనే బడేబాబా ఒడిలో వొరిగి ప్రాణం విడిశాడు.
విజయానందునితో సాయి చెప్పిన వసతిగృహం అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు, ఆయన మూయమన్న ద్వారాలు యింద్రియాలు, మనస్సు. పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పింది. విజయానందుడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూచుకోవలసి వచ్చింది.