సాయిబాబా ప్రార్థనా మహిమాన్వితం...

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:50 IST)
మంత్ర జపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసిన, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి నిర్వహణలో, ప్రవర్తనలో సరిగ్గా లేకపోతే మోక్షం కలుగదని సాయిబాబా తన భక్తులను బోధించేవారు. ఒక మెుక్క పెరగాలంటే దానికి నేల, నీరు, గాలి, సూర్యుడు ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ ఆ మెుక్క నుండి ఏమీ ఆశించదు. 

అదేవిధంగా మీరు ఎవరినుండి ఏమీ ఆశించకుండా చేతనైనంత వరకు మేలు చేయాలి లేదా కనీసం కీడు చేయకుండా ఉండాలి అంటూ బాబా బోధించేవారు. 
 
ఎల్లవేళలా దైవనామస్మరణ చేసేవారిని మాత్రమే కాకుండా, కష్టాలలో ఉన్నవారిని కూడా ఆదుకోవడం, ఆకలితో ఉన్నవారిని ఆదరించడం వంటి సహాయాలు చేయాలి. వీటిని ఆచరించేవారిని కూడా బాబా సదా అంటిపెట్టుకుని ఉంటారు. బాబా చూపిన ఆధ్యాత్మిక బాట కేవలం భక్తిపరమైనదే కాదు, మంచి జీవనశైలిని కూడా అలవరుస్తుంది. 
 
సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవునితో బేరం కుదుర్చుకోవడం కాదు. ఈ పని జరిగితే నీ దగ్గరకు వస్తాను అని మెుక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. జీవితమనే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లడే సమయం అన్నమాట. 
 
నిజమైన భక్తి ఎలా ఉండాలంటే మనసులో మంచిని తలుచుకోవాలి. కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. చివరగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిర్మలం కాని మనసులోనికి భగవంతుడు ప్రవేశించలేడు. కనుక చెప్పిన మంచి పనులన్నింటినీ చేస్తూ, మనసును పూర్తిగా భగవంతునిపైనే లగ్నం చేయాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు