కార్తీకమాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరిని వాడకూడదట..!

FILE
కార్తీకమాసం శివప్రీతికరమైనది. ఈ మాసం శివార్చన చేసిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు ఉండవని పురోహితులు చెబుతున్నారు. అలాంటి ఈ మాసంలో ఏ మంత్రాన్ని స్తుతించినా గొప్ప ఫలితాలనిస్తుందని నమ్మకం. తులసి (పూసల) మాల ధరించడం, ఉసిరిక చెట్టును అర్చించడం కూడా శుభదాయకం.

అయితే కార్తీక నియమాన్ని పాటించేవారు ఇంగువ, ఉల్లి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడి కాయ, చిక్కుడు, వెలగపండ్లను వంటల్లో చేర్చుకోకూడదు. అదే విధంగా మిగిలిన అన్నం, మాడన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలను కూడా వాడకూడదు. కార్తీక మాసంలో వచ్చే సప్తమినాడు ఉసిరిక, అష్టమినాడు కొబ్బరి, ఆదివారం ఉసిరికలను ఉపయోగించకూడదు.

కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. పరమేశ్వరుడు "అశుతోషుడు" కాబట్టి భక్తులను తక్షణమే ఆదుకుంటాడని శాస్త్రాలు అంటున్నాయి.

అందుచేత శివుడిని అలంకారాలు, నైవేద్యాలు, రాజోపచారాలతో మెప్పించడం కంటే... ఒక సారి "శివ" అని మరోసారి "శివ" అనే లోపలే ఆయన కరిగిపోతాడని విశ్వాసం. అందుచేత కార్తీక మాసంలో శివస్తుతితో అష్టైశ్వర్యాలు, మోక్షము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి