"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటికి గురిచేసింది. తాజాగా మరో విమానం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. మేడే కాల్ ఈ విమానాన్ని రక్షించింది. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు సంబంధిత వర్గాల సమాచారం...
గౌహతి నుంచి చెన్నైకు ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉండటాన్ని పైలెట్లు గుర్తించారు. వెంటనే పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ఏటీసీ)కి మేడే కాల్ సందేశం పంపించారు. తక్షణమే బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. తాము ఆపదలో ఉన్నామని, తక్షణం సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు ఉపయోగిస్తారు.