దేవప్రశ్నం.. జ్యోతిశ్శాస్త్రానికే అవమానం!!

File
FILE
కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగను తెరిచే అంశంపై నిర్వహించిన దేవప్రశ్నం జ్యోతిష్యశ్శాస్త్రానికే అవమానకరమని భారతీయ జ్యోతిశ్శాస్త్ర పరిషత్ అభిప్రాయపడింది.

ఈ తరహా దేవప్రశ్నం ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నప్పటికీ ఏ ప్రతిఫలం వచ్చిందో తెలియజేయకుండా దాన్ని మరోసారి నిర్వహించడం జ్యోతిశ్శాస్త్రానికే అవమానకరంగా భావిస్తున్నట్టు పరిషత్ అధ్యక్షుడు ఎం.మోహన్ దాస్ ఫణిక్కర్ అభిప్రాయపడ్డారు. దేవుడికి చెందిన అమూల్యమైన వేల కోట్ల రూపాయల సంపద వ్యవహారంపై దేవప్రశ్నం నిర్వహించడంపై పరిషత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

దీనిపై ఆయన మాట్లాడుతూ... గత కొన్ని దశాబ్దాలుగా దేవప్రశ్నం కార్యక్రమాన్ని అనేకసార్లు నిర్వహించారు. వాటిలో ఎందులోనూ లోపలున్న సంపదపై ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయినప్పటికీ మరోమారు నిర్వహించారు. ఇది జ్యోతిశ్శాస్త్రానికే ఎంతో అవమానకరం అని అన్నారు. ఇప్పటికైనా దేవప్రశ్నంకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా, పద్మనాభ స్వామి ఆలయంలోని అమూల్య సంపద వ్యవహారంపై ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం సుప్రీంకోర్టునాశ్రయించింది. ఆలయంలోని చివరి నేలమాళిగని తెరిచేందుకు అనుమతివ్వరాదంటూ ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆలయంలోని నేలమాళిగల్లో ఇటీవల బయటపడిన అమూల్యమైన సంపద వీడియో చిత్రాలు, ఫొటోలు కేవలం ఆ సంపద భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల సంపదను వీడియో తీయాలన్న ఆదేశాలను నిలిపివేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి