బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్

శుక్రవారం, 20 జూన్ 2025 (20:08 IST)
బనకచర్ల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బనకచర్ల - గోదావరి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు. 
 
ఏపీ, కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చేముందు తెలంగాణాతో చర్చించివుంటే ఈ వివాదం ఉండేదికాదన్నారు. ఏపీ ప్రీ ఫ్రీజిబులిటీ రిపోర్టు ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తుందని, బనకచర్లపై కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమైంది అని తెలిపారు. 
 
'ఇద్దరు సీఎంలు కూర్చొని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒక రోజు కాదు నాలుగు రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జల వివాదాలు  చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్ధాం. వివాదాల పరిష్కారంలో నాకెలాంటి భేషజాలు లేవు. ఇద్దరు వ్యక్తులు కాదు.. రాష్ట్రాల మధ్య వ్యవహారం ఇది. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో మార్పులు చేస్తే చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపాం. అనేక అంశాలను సీఎం స్థాయిలో చర్చించాం' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు