దేవుడి పూజ కాగానే మంగళహారతి పాడతారెందుకు..?

గురువారం, 28 జులై 2011 (16:27 IST)
FILE
పూజకు ఆది, అంతము ఉన్నాయి. పూజ ప్రారంభంలో తలమీద నీళ్లు చల్లుకుంటూ. "అపవిత్రపి పవిత్రోవా.." అని అంటాము. దీనితో పూజ ప్రారంభమవుతుంది. అలాగే ఇళ్లల్లోనే కాదు. దేవాలయాల లోనూ పూజ అయ్యాక మంగళహారతి ఇవ్వడం పూజావిధిలో భాగమే. దీనితో పూజ పరిసమాప్తమవుతుంది.

ఇంటిలో పూజ మనచేతిలో ఉండేది. మన ఒక్కరికే (కుటుంబానికి) సంబంధించిన పూజ. కనుక పూజ కాగానే మంగళహారతి ఇచ్చి పూర్తి చేస్తాం. దేవాలయాల్లో దేవుడికి ఒకే ఒక్క పూజకానీ, ఒకే ఒక్కరి పూజ కానీ కాదు. కాబట్టి, మంగళహారతి అనేది అనే పర్యాయాలు ఇస్తారు. దేవాలయాల్లో జరిగేదంతా మంత్రపూర్వకంగా జరుగుతుంది. కనుక మంగళహారతి "సర్వః ప్రజామ్నే గోపాయ.." అంటూ మంత్రపూర్వకంగా వినిపిస్తుంది.

ఇళ్ళలో మంత్రపూర్వకంగా పూజ జరిగినా దేవుడు గాన ప్రియుడు కాబట్టి ఆయనకు మంగళహారతి సమయంలో రాగయుక్తంగా, మంచిగొంతుతో అందరూ కలిసి పాటపాడి వినిపిస్తారు.

పూజ అయిన తర్వాత మంగళహారతి పాటను పాటడం అంటే నాకు వచ్చిన సంగీతం పాండిత్యం ఈ కంఠ మాధుర్యం, ఈ భక్తీ, శ్రద్ధా, నా కుటుంబ శ్రేయస్సు, అన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వల్ల వచ్చినవే.

కనుక, వీటినన్నింటినీ నీకే అంకిత మొనర్చుకుంటున్నాను దేవా! అని తన్మయంత్వంతో తెలుపడమే అవుతుంది. ఈ విషయాన్ని జ్యోతిసాక్షిగా సర్వాంతర్యామి అయిన దేవుడికి తెలుపడం పూజ అయినదని ప్రకటించడం మంగళ హారతి అవుతుందని పురోహితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి