పుట్టపర్తి సత్యసాయి బాబా సంపద రూ.48.97 కోట్లు!

FILE
పుట్టపర్తి సత్య సాయి బాబా సంపద రూ.48.97 కోట్లు అని తేలింది. గత రెండు రోజులుగా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. మూడు దశల్లో లెక్కింపు ప్రక్రియ ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ లెక్కింపులో రూ.15.09 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు లభించింది.

లెక్కింపులో ఎక్కడా అనుమానాలకు తావు లేకుండా నిర్వహించిన ఈ సోదాలో మొత్తం రూ.48.97 కోట్ల ఆస్తులన్నట్లు తేలింది. గత నెల 16న యజుర్వేద మందిరంలోని సత్యసాయి వ్యక్తిగత గదిలో ఉన్న సంపదను డ్రస్ట్ సభ్యులు లెక్కించారు. దీనిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో లెక్కింపు బాధ్యతను జిల్లా అధికారులకు అప్పగించారు.

సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ లెక్కింపు ప్రక్రియలో బంగారం, వెండి, నగదు కలిపి రూ.77 లక్షల విలువైన వాటిని బ్యాంకులో జమ చేశారు. సోమవారం రాత్రి వరకు నిర్వహించిన లెక్కింపులో 34 కిలోల బంగారం, 340 కిలోల వెండి, కోటి 93 లక్షల రూపాయల నగదును గుర్తించారు. వాటి విలువ మొత్తం రూ.9.28 కోట్లు ఉంటుందని అంచనా.

మంగళవారం జరిగిన లెక్కింపులో బంగారం కిలో 579 గ్రాములు, వెండి 1,161 కిలోలు, రెండు వజ్రాలు పొదిగిన మణికట్టు ఆభరణం, రెండు తలపిన్నులు, రూ.36.87 లక్షల నగదు లభించింది. మంగళవారం రాత్రి ప్రశాంతి నిలయంలో లభించిన ఆభరణాలు, నగదు కలిపి రూ.5.19 కోట్లు ఉంటుందని లెక్కలు తేల్చారు.

వెబ్దునియా పై చదవండి