శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని పూర్తిగా కమర్షియల్గా మార్చేస్తున్నారు. పర్యాటకాభివృద్ధి పేరుతో శ్రీవారి దర్శనాన్ని కూడా వ్యాపారంగా మార్చుతున్నారు. బస్సుల్లో, కాలినడకన వచ్చే సామాన్య భక్తులకు స్వామి దర్శనం గగనంగా ఉంటే గగనమార్గాన వచ్చే వాళ్లకు మాత్రం నిమిషాల్లో దర్శనభాగ్యం కలిగించడానికి ప్రభుత్వమే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆలయాల పర్యాటకం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రకరకాల ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా 24 గంటల్లో శ్రీశైలం మల్లేశ్వరున్ని, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి వీలుగా హెలికాప్టర్లో సేవను ప్రారంభించాలని భావిస్తోంది. ఒక ప్రైవేటు సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరి అర్థగంటలో శ్రీశైలం చేరుకుంటుంది.
అక్కడ 12గంటల దాకా ఉండి స్వామివారి దర్శనంతో పాటు పర్యాటక ప్రదేశాలకు చూపిస్తారట. ఆపై తిరుపతికి చేరుకుని పద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయించి రాత్రికి తిరుమలకు తీసుకెళతారు. రెండోరోజు ఉదయాన్నే బ్రేక్ దర్శనం టికెట్లు ఇచ్చి దర్శనం చేయిస్తారు. ఆపై తిరుపతికి చేరుకుని హెలికాఫ్టర్లో విజయవాడ బయలుదేరుతారు. 8 గంటల కల్లా విజయవాడ చేరుతారు. ఇదే తరహాలో హైదరాబాద్ - శ్రీశైలం - తిరుపతి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ ఇలా చేస్తే శ్రీవారి దర్శనాన్ని వ్యాపారమయం చేసినట్లు కాదా? అనేది ప్రశ్న. ఇప్పటికీ విఐపి బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరుతో ఇస్తున్న బ్రేక్ దర్శనాల వల్ల రోజూ ఉదయం కనీసం రెండు గంటలపాటు సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించడం లేదు. పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే బ్రేక్ దర్శనం టికెట్లు లభిస్తుంటాయి. స్వామివారి దర్శనంలో ఈ వివక్ష తగదని చాలామంది విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్లోని వ్యక్తుల సమయం చాలా విలువైనది కాబట్టి అలాంటివి వారికి బ్రేక్ దర్శనం కల్పించి త్వరగా దర్శనం చేయించారంటే అర్థముంది. అలాకాకుండా 24గంటల్లో దర్శనం చేయించే పేరుతో హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళకంతా బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయిస్తే అది ఫక్తు వ్యాపారం అవుతుంది కదా... అని వాదిస్తున్నవారు ఉన్నారు.
హెలికాఫ్టర్లో ఆరుగురు వ్యక్తులే ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతానికి విజయవాడ నుంచి ఒకటి, హైదరాబాద్ నుంచి ఒక హెలికాఫ్టర్ వస్తుందనుకుంటే 12 మందికి మాత్రమే బ్రేక్ దర్శనం టికెట్లు ఇస్తారనుకోవచ్చు. అదే రాబోయేకాలంలో తిరుపతికి వచ్చే అన్ని విమానయాన సంస్థలకూ ఇలాంటి అవకాశం కల్పిస్తే బ్రేక్ దర్శనాలు భారీగా పెరిగిపోవా.. అనేది అనుమానం. ఇప్పటికే రూ.300 శీఘ్రదర్శనంలో కొన్ని స్లాట్లను టూరిజం శాఖకు, ఆర్టీసీకి ఇచ్చారు. హెలికాప్టర్లో లేదా విమానయాన భక్తులకూ 300 రూపాయల శీఘ్రదర్శనం స్లాట్లలో కొన్ని టికెట్లు కేటాయించవచ్చు. అంతేగానీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇవ్వడం తగదని పలువురు అంటున్నారు. ఈ విషయాన్ని తితిదే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది.