భక్తిగా ప్రార్థిస్తే మన చెంతనే ఉంటాడు ఆ షిర్డీ సాయిబాబా

బుధవారం, 19 మే 2021 (22:30 IST)
సాయిబాబా పూజకు ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. తిథి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. ఎక్కడివారు, ఏ భాషవారు అని చూడనవసరం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా ప్రారంభించవచ్చు.
 
సాయిబాబా చరిత్ర లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణం చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక సప్తాహంలో పూర్తిచేయలేనివారు రెండు లేదా మూడు వారాలలో పూర్తిచేయవచ్చును. నిత్య పారాయణం కూడా చేయవచ్చును. కానీ పారాయణం చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం.
 
సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చును.
 
సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయి బాబా గ్రంథ పారాయణకు కావలసిదల్లా భక్తిభావన. సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. 
 
సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు