కొత్త సంవత్సరంలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు నిరుత్సాహం

సోమవారం, 4 జనవరి 2021 (15:11 IST)
కరోనా నామ సంవత్సరంగా చరిత్ర పుటల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయిన 2020 సంవత్సరం వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం 2021లోకి ప్రవేశించి కేవలం నాలుగు రోజులే అయింది. అయితే, ఈ కొత్త సంవత్సరంలో పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. దీనికి కారణం ఈ యేడాది రెండు మౌఢ్యమిలు రావడంతో పాటు బలమైన ముహూర్తాలు లేకపోవడమే. దీంతో కొత్త సంవత్సరంలో ఒక్కటవుదామని అనుకున్న యువతీయువకులు ఇపుడు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
నిజానికి ఈ యేడాది గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే వచ్చింది. ఇలా రావడం పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారింది. పైగా, ఈ నెల 8వ తేదీ వరకే మంచి ముహూర్తాలు ఉన్నా, 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమని వేదపండితులు చెబుతున్నారు. మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని వారు అంటున్నారు. 
 
ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చకులు అంటున్నారు.
 
అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ సుమారు 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
 
ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ కొద్ది రోజులు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లు కొవిడ్‌ ప్రభావంతో పెళ్లిళ్లకు బ్రేక్‌ పడితే, ఇప్పుడు నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోవాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి.
 
ఒకేసారి రెండు మౌఢ్యాలు...  
గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. జీవితంలో పెళ్లి ముఖ్యమైన ఘట్టమైనందునా శుభ ముహూర్తంలో చేసుకోవడం మంచిదని పండితులు తెలుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు