శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే...

శుక్రవారం, 8 జూన్ 2018 (13:26 IST)
జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే ప్రతి మంగళ, శుక్రవారాలలో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఆలయ దర్శనం చేసుకుంటే అమ్మవారి అభయం పొందుతారు. 
 
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపు రంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇప్పించాలి.
 
ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా తొమ్మిది శుక్రవారాలు చేయడం వలన కష్టాలు తీరి అనుకున్న పనులు విజయవంతమై పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గువేసి, ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీదేవి మన ఇంటిలోనే ఉండి మనకు సకల శుభాలను చేకూరుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు